వయోభారం రీత్యా బీజేపీ వ్యవస్థాపకుడు ఎల్కే అద్వాణీని ఎన్నికల బరి నుంచి పక్కనబెట్టిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆయన కుమార్తె ప్రతిభా అద్వాణీకి టికెట్ ఇవ్వాలని భావిస్తోందట. మధ్యప్రదేశ్లోబీజేపీకు కంచుకోట అయిన భోపాల్లో ప్రతిభను బరిలోకి దింపాలని కమలం పార్టీ యోచనలో ఉంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ను నిలబెట్టింది. దీంతో దిగ్విజయ్ను ఎదుర్కొనేందుకు బీజేపీ ప్రతిభ అద్వాణీ వైపు మొగ్గుచూపుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
భోపాల్ నియోజకవర్గానికి 1989 నుంచి బీజేపీ నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి భోపాల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ను బరిలోకి దింపింది. దీంతో ఈ ఎన్నికను ప్రతిష్థాత్మకంగా తీసుకున్న బీజేపీ బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ప్రతిభా అద్వాణీ పేరును పరిశీలిస్తోంది. అద్వాణీ కుటుంబానికి భోపాల్లో మంచి పేరుంది. వయసు రీత్యా అద్వాణీని బీజేపీ పక్కనబెట్టింది. దీన్ని ముందుగానే ఊహించిన ఆయన తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని కోరారు. ఇందుకు పార్టీ తిరస్కరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పార్టీనే స్వయంగా ప్రతిభా అద్వాణీని బరిలోకి దింపాలని చూస్తోంది. అదే జరిగితే భోపాల్ ఎన్నిక దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారనుంది.