వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్ తాడేపల్లిలోని నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణస్వీకారోత్సవ ఏర్పాట్లను అధికారులు జగన్కు వివరించినట్టు సమాచారం. మరోవైపు ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితులు, సుపరిపాలనకు చేపట్టాల్సిన మార్పులపై కసరత్తును వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. అలాగే, ప్రమాణస్వీకారం అనంతరం కీలక అధికారుల బదిలీలకు సంబంధించి జగన్తో చర్చించనున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా వైఎస్ జగన్ను కలిశారు. ఇక నేడు వైసీపీ అధ్యక్షుడు జగన్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం తిరుమలకు చేరుకొని, రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే ఇడుపులపాయతో పాటు కడప పెద్ద దర్గాను కూడా దర్శించుకుంటారు. 30 న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు.