ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ గాంధీభవన్లో ఉన్న కుర్చీలన్నింటినీ తీసుకువెళ్లిపోయారు. మహారాష్ట్రలోని సిల్లాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ ఔరంగాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని పార్టీ అగ్ర నాయకత్వాన్ని కోరారు. కానీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం నిరాకరించింది. సత్తార్ స్థానంలో ఎమ్మెల్సీ సుభాష్ జాంబాద్కు ఔరంగాబాద్ ఎంపీ టికెట్ను కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సత్తార్.. తన అనుచరులతో కలిసి పార్టీ ఆఫీసులో ఉన్న 300 కుర్చీలను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా సత్తార్ మీడియాతో మాట్లాడుతూ... అవి తన కుర్చీలని, కాంగ్రెస్ సమావేశాల నిమిత్తం తెచ్చి పెట్టానని, ఇప్పుడు పార్టీని వీడినందున వెనక్కు తెచ్చుకున్నానని అన్నారు. టికెట్ లభించిన వారే పార్టీ కోసం ఖర్చు చేయాల్సి వుంటుందని అన్నారు. కాగా, అబ్దుల్ సత్తార్ కు స్థానికంగా మంచి పట్టున్న నేతగా పేరుంది. సత్తార్ పార్టీని వీడటంపై జంబాద్ మాట్లాడుతూ, సత్తార్ అవసరం తమకుందని, ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని అన్నారు. ఆయనకు అవసరమై ఆ కుర్చీలు తీసుకెళ్లారేమోనని అన్నారు.