నామినేటేడ్ పదవుల భర్తీపై కేసీఆర్ దృష్టి...ఒక్కరికి ఒక్క పదవేనంటూ పార్టీ కీలక నిర్ణయం
తెలంగాణలో కార్పొరేషన్ చైర్మన్లకు టెన్షన్ పట్టుకుంది. గత ప్రభుత్వంలో చైర్మన్లుగా నియామకైన నేతల పదవీ కాలం ముగియనుంది. మరికొందరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ముందు పదవులకు రాజీనామా చేశారు. నామినేటెడ్ పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మళ్లీ వరిస్తాయా లేదా అన్నది పదవులు ఆశీస్తున్న నేతల్లో టెన్షన్ పట్టుకుంది.
తెలంగాణలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన గులాబీ బాస్ కేసీఆర్ నామినేటేడ్ పదవుల భర్తీపై దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మూడునెలల్లోపే పోస్టులు భర్తీ చేసేందుకు పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేసిన నేతల పనితనం కొలమానంగా పదవులు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కరికి ఒక్క పదవేనంటూ పార్టీ కీలక నిర్ణయం తీసుకోవటంతో పదవులపై ఆశలు పెట్టుకున్న నేతల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం కార్పోరేషన్ చైర్మన్ పదవుల్లో కొనసాగుతున్న నేతలు తిరిగి అవకాశం లభిస్తుందా లేదా అన్న టెన్షన్ లో ఉన్నారు.
తెలంగాణలో తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న చాలా మంది నిరాశకు గురయ్యారు. నేతల అసంతృప్తిని గుర్తించిన గులాబీ దళపతి ఈసారి ఎక్కువ మంది నేతలకు పదవుల పంపిణీలో న్యాయం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ గా సిద్ధిపేట జిల్లాకు చెందిన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిని నియమించిన కేసీఆర్ రానున్న మూడు నెలల్లోపే కార్పొరేషన్ పదవులు, జిల్లా పార్టీ కన్వీనర్లు ఇతర పదవుల భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ అనంతరం కార్పోరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవుల నియామకం చేపట్టే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
కార్పొరేషన్ చైర్మన్ పదవులకు రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కొద్ది మంది మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఓటమి పాలన సోమవరపు సత్యనారాయణ, పిడమర్తి రవి, ప్రేమ్ సింగ్ రాథోడ్, ఇనాయత్ అలీబాక్రీలకు తిరిగి నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం ఇస్తారో లేదననే బెంగ పట్టుకుంది. ఇక మరికొందరు కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం ముగుస్తుండటంతో మళ్లీ రెన్యూవల్ చేస్తారని ఆశిస్తున్నారు.
పదవులుకు రాజీనామాలు చేసినవారు పదవీ కాలం ముగిసిన వారు పదవులు ఆశిస్తున్ననేతలు ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారు. ఎవరికి కార్పోరేషన్ పదవులు వరించనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణలు జిల్లాల వారీగా ఎమ్మెల్యే టికెట్లు ఆశించ బంగపడ్డ నేతలు, ద్వితియ శ్రేణి నేతలకు అవకాశాలుంటాయని సంకేతాలు రావడంతో పార్టీ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి.