మద్యపానం నిషేధం అమలుపై ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో అన్వేషించాలని అధికారుల్ని సూచించారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. ఈరోజు ఆర్థిక, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్, వేర్వేరు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్ట్ షాపులను తొలగించాలని ఆదేశించారు. ఇక.. రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జగన్ చర్చించారు. సంక్షేమ పథకాలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన జగన్.. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని స్పష్టం చేశారు.