వరుస వలసలు పార్టీని ఇబ్బంది పెడుతుండడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లడానికి సిద్దమవుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వలసలు ఆగకపోవడంతో చివరకు జనంలోకి వెల్లడమే మేలని హస్తం పార్టీ నిర్ణయించింది. ప్రజా పరిరక్షణ యాత్ర పేరుతో.. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజికవర్గాల్లో యాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ ఎన్నికల తరువాత వరుస వలసలు కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకంగా మారుతుండడంతో ఆ పార్టీ ప్రజాబాట పడుతోంది. ప్రతిపక్ష హోదా పోతుందనే భయం హస్తం పార్టీకి తలనొప్పిగా మారుతుండడంతో పార్టీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అందులో బాగంగా ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క ప్రజా పరిరక్షణ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెల్లడానికి రెడీ అవుతున్నారు. ఆదివారం భద్రాద్రి నుంచి యాత్రను ప్రారంభింస్తున్నారు.
మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని సీఎల్పీని, టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం కూడా చేసే ఆలోచనలో ఉంది గులాబీ టీం. దీంతో కాంగ్రెస్ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో యాత్ర చేయబోతున్నారు భట్టి విక్రమార్క. భద్రాచలంలో పూజలు చేసి ఉదయం పదకొండున్నరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఈ యాత్ర లక్ష్యం పార్టీని వీడిన ఎమ్మెల్యేల నియోజికవర్గాల్లో కార్యకర్తలను, నేతలను కాపాడుకోవడమే. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ద్వారా కార్యకర్తల్లో భరోసార నింపుతారా అధికారపార్టీ దూకుడు తగ్గిస్తారో చూడాలి.