135 కోట్ల మంది ఎదురుచూసే క్షణం రానేవచ్చింది. కాసేపట్లో అభినందన్ దయాది దేశం నుంచి స్వదేశంలోకి అడుగుపెడుతున్నాడు. ఆ క్షణం కోసమే యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఈ మధ్యాహ్నం తర్వాత ఏ క్షణమైనా అభినందన్ వాఘా బోర్డర్ నుంచి మనదేశానికి రానున్నాడు. ఇందుకోసం వాఘా సరిహద్దు దగ్గర ఉత్కంఠ భరితమైన వాతావరణం నెలకొంది. కాగా, తమ కుమారుడిని కలుసుకునేందుకు విమానం ఎక్కిన అభినందన్ తల్లిదండ్రులకు అనూహ్య గౌరవం దక్కింది. విశ్రాంత ఎయిర్ మార్షల్ ఎస్ వర్ధమాన్, శోభా వర్ధమాన్ నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చేందుకు చెన్నైలో విమానం ఎక్కారు. అయితే వీరిని గుర్తుపట్టిన ప్రయాణికులు లేచి నిలబడి కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. వర్ధమాన్ తల్లిదండ్రులతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.