యువతిని మోసం చేసిన సినీ రచయిత...పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే...

Update: 2019-06-01 12:59 GMT

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. వివాహం చేసుకున్న కొన్ని గంటల్లోనే యువకుడు మోసం చేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినీ రచయిత రమణ గౌతమ్‌‌, యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతి దగ్గర నుంచి పది లక్షలకు పైగా తన అవసరాలకు వినియోగించుకున్నాడు. అయితే రచయిత గౌతమ్‌ యువతిని మోసం చేయబోగా, పోలీసులకు ఫిర్యాదు చేస్తాననడంతో పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లైన కొన్ని గంటలకే సినీ రచయిత రమణ గౌతమ్‌ మొఖం చాటేయడంతో బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది.

సినీరచయిత ఎర్రంశెట్టి రమణ గౌతమ్ ఫిల్మ్‌ నగర్‌లో నివశిస్తున్నాడు. సినిమాలకు, టీవీ సీరియళ్లకు కథలు రాస్తుంటాడు. ఈ సమయంలో ఓ యువతి పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రేమ కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఇదే అదునుగా చూసుకుని తన దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు వాడుకున్నాడంటూ బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. పెళ్లి చేసుకుని, తన డబ్బులు వాడుకుని పరారైన సినీ రచయిత గౌతమ్‌ను పోలీసులు పట్టుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేస్తోంది.

Similar News