ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ధనదాహానికి పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెండేళ్లు పోలవరం పనుల జోలికి వెళ్లలేదని ఆయన తెలిపారు. 2005లోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి అన్ని అనుమతులు తీసుకువచ్చారని ఆయన గుర్తుచేశారు. రూ 4,500 కోట్లు ఖర్చు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వైఎస్ ఉండి ఉంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా పోలవరం ప్రాజెక్టు ఫలాలు ఇప్పటికే అనుభవించే వారని బొత్స అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక నిర్ణీత సమయంలో పోలవరం పూర్తి చేస్తారని చెప్పారు. ఈ నెల 23 తర్వాత ఏ క్షణమైనా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని బొత్స స్పష్టం చేశారు.