కొత్త నినాదాలతో కాంగ్రెస్, బీజేపీల ఎన్నికల ప్రచారం...చౌకిదార్ చోర్ బన్గయా అంటూ...
సార్వత్రిక ఎన్నికల వేళ ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ కొత్త నినాదాలతో ముందుకొస్తున్నాయి. సంక్షేమ పథకాలు జపిస్తూనే ప్రత్యర్ధి పార్టీలపై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రధాని మోడీ టార్గెట్గా చౌకిదార్ చోర్ బన్గయా నినాదంతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. రఫేల్ డీల్ను ప్రస్తావిస్తూ దేశ సంపదను కార్పోరేట్లకు దోచి పెడుతున్నారంటూ అధినేత రాహుల్ నుంచి ద్వితియ శ్రేణి నాయకుల వరకు ప్రచారం చేస్తున్నారు.
రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు బీజీపీ కూడా కొత్త నినాదంతో ప్రజల ముందుకు వచ్చింది. సోషల్ మీడియా వేదికగా 'మై భీ చౌకీదార్'అంటూ ప్రచారాన్ని ఉధృతం చేసింది. ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతాలో తన పేరును ఏకంగా 'చౌకీదార్ నరేంద్ర మోదీ'గా మార్చారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు తమ ట్విట్టర్ ఖాతాల పేర్ల ముందు 'చౌకీదార్' పదాన్ని చేర్చారు. 'నేను కాపాలాదారుడినే దేశానికి సేవ చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నాను. నేను ఒంటరి కాదు. అవినీతి, సామాజిక దుశ్చర్యలు వంటి వాటిపై పోరాడే ప్రతి ఒక్కరూ చౌకీదార్లేనంటూ బీజేపీ నేతలు ప్రచారం చేపట్టారు. దేశాభివృద్ధి, పురోగతి కోసం కృషి చేసే ప్రతీ భారతీయుడు 'మై భీ చౌకీదార్'అంటూ ట్వీట్ చేశారు.
2014 ఎన్నికల్లో ఛాయ్వాలా పేరుతో ప్రచారం చేసిన బీజేపీ చౌకిదార్ నినాదాన్ని కూడా అదే స్ధాయిలో తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఐదేళ్ల పాలనలో చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను గ్రామ స్ధాయి నుంచి ప్రచారం చేస్తూ కాపాలాదారుడిగా ఉండటం వల్లే ఇవన్నీ సాధ్యం అయ్యాయంటూ ప్రచారం చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ హాయంలో జరిగిన కుంభకోణాలను వివరిస్తూ చౌకిదార్ నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను మరోసారి తెరపైకి తెచ్చేలా నామ్దార్ ఉద్యమానికి కూడా కాషాయ దళం వ్యూహరచన చేస్తోంది.