టీడీపీలంటే బీసీలని .. బీసీలు అంటే టీడీపీ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్న రాజమహేంద్రవరంలో నిర్వహించిన జయహోబీసీ సభలో పాల్గొన్న ఆయన బీసీలపై వరాల జల్లు కురిపించారు. ఆదరణ పథకంలో బీసీలను తాము ఆదరిస్తే 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రద్దు చేసి బీసీల కడుపు కొట్టారంటూ చంద్రబాబు ఆరోపించారు. 2018-19లో ఆదరణ పథకం కింద 950 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆధునిక పరికరాలను అందించామన్నారు. బీసీలను అత్యున్నత స్ధానంలో కూర్చొబెట్టిన ఘనత తమదేనని బాబు అన్నారు .
తాము అధికారంలోకి వచ్చాక చేనేతలకు 111 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు చేనేతలకు అందిస్తున్న 100 యూనిట్ల ఉచిత విద్యుత్ను 150 యూనిట్లను పెంచుతున్నట్టు ఆయన ప్రకటించారు. పట్టు నూలు విషయంలోనూ వెయ్యి రూపాయల సబ్సిడీని రెండు వేలకు పెంచుతున్నట్టు బాబు సభా ముఖంగా ప్రకటించారు .విదేశాల్లో చదువుకునే బీసీల పిల్లల కోసం 15 లక్షల రూపాయలు ఇస్తామని వెల్లడించారు.