తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసే పార్లమెంట్ అభ్యర్ధుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. తెలంగాణలో పది మంది అభ్యర్ధులను ప్రకటించిన అధిష్టానం ఏపీలో రెండు స్ధానాలకు మాత్రమే పరిమితం చేసింది. కొత్తగా చేరిన వారితో పాటు పార్టీని నమ్ముకుంటూ వస్తున్న వారికి కాషాయదళం పెద్దపీట వేసింది.
లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఏపీకి సంబంధించి ఇద్దరు, తెలంగాణకు సంబంధించి 10 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కేంద్ర మంత్రి జేపీ నడ్డా విడుదల చేశారు. రెండు రోజుల క్రితం పార్టీలో చేరిన డీకే అరుణకు మహబూబ్నగర్ సీటు కేటాయించగా సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయ స్థానంలో కిషన్రెడ్డిని ఎంపిక చేశారు. పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతిని నాగర్ కర్నూల్ స్థానం నుంచి బరిలోకి దింపారు. అంతా ఊహించినట్టుగానే కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్లకు దక్కాయి. వరంగల్ నుంచి చింత సాంబమూర్తి, మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్సీ రామచంద్రరావు, భువనగిరి నుంచి శ్యామ్ సుందర్ రావులను రంగంలోకి దించింది. ఇక నల్లగొండ జిల్లా నుంచి గార్లపాటి జితేందర్ రెడ్డి, మహాబూబాబాద్ నుంచి జాటోతు హుస్సేన్ నాయక్ సీట్లు దక్కించుకున్నారు.
ఏపీలో సీనియర్ నేతలుగా ఉన్న పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయలను లోక్సభ బరిలోకి దింపింది. పురందేశ్వరిని విశాఖ నుంచి , కన్నాను నరసరావు పేట నుంచి రంగంలోకి దింపింది. రెండో విడత జాబితాలో తెలంగాణలో మిగిలిన 7 స్ధానాలతో పాటు ఏపీలోని 23 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నెల 25తో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపధ్యంలో బీజేపీ అధిష్టానం అభ్యర్ధుల ఎంపిక కోసం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.