డ్వాక్రా మహిళలకు సీఎం వరాలు

Update: 2019-01-25 10:54 GMT

సమాజంలో మహిళలకు గౌరవం పెరగాలనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశానని సీఎం చంద్రబాబు అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా డ్వాక్రా మహిళలకే ఉందన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో నిర్వహించిన 'పసుపు-కుంకుమ' సభలో పాల్గొన్న సీఎం నాలుగున్నరేళ్లలో పసుపు-కుంకుమ కింద 21 వేల 116 కోట్లు అందజేశామన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆడబిడ్డలు ఆధారపడకూడదన్నారు. రాబోయే రెండు నెలల్లో ఒక్కో డ్వాక్రా మహిళ బ్యాంకు ఖాతాలో 10వేలు చొప్పున జమ చేస్తామని మూడు విడతలుగా చెక్కుల రూపంలో వాటిని అందజేస్తామని సీఎం ప్రకటించారు.

ప్రపంచంలో ఎక్కడైనా మహిళలకు 20వేలు సాయం చేశారా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అని అందుకే ఎప్పటికీ తన మనసులో డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రత్యేకస్థానం ఉంటుందని చెప్పారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనూ మహిళలకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదని విమర్శించిన చంద్రబాబు ఏపీలో మహిళలకు స్మార్ట్‌ఫోన్‌ కూడా అందజేస్తామని ప్రకటించారు. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. 

Similar News