భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. రాజస్థాన్లోని బికనేర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. సాధారణ శిక్షణ నిమిత్తం బికనేర్ సమీపంలోని నాల్ ఎయిర్బేస్ నుంచి బయల్దేరిన మిగ్-21 విమానం కాసేపటికే కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ విమాన పైలట్ ప్రాణాలతో బయటపడ్డారని బికనేర్ ఎస్పీ తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.