బాబ్రీ మసీదు-రామ మందిర వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తుల కమిటీలో ఆధ్మాత్మిక గురువు రవిశంకర్ను నియమించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. మధ్యవర్తి కమిటీ నుంచి రవిశంకర్ను తప్పించాలని ఓవైసీ అభిప్రాయపడ్డారు. గత ఏడాది నవంబర్లో ముస్లింలపై రవిశంకర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అసద్ అన్నారు. అయోధ్య అంశంపై ముస్లింలు తగాదా మానకుంటే, భారత్ మరో సిరియాలా మారుతుందని రవిశంకర్ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్యానెల్లో శ్రీశ్రీ వద్దంటూ అసద్ అన్నారు. శ్రీశ్రీ బదులుగా మరో తటస్థ వ్యక్తిని నియమించాలన్నారు. రవిశంకర్ గతంలో హిందువులకు అనుకూలంగా మాట్లాడారని గుర్తు చేసిన అసదుద్దీన్ ఒవైసీ రామమందిర నిర్మాణానికి అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి తటస్థుడెలా అవుతారని ప్రశ్నించారు.