భారత్ వాయుసేన సుదీర్ఘ కాలం నుంచి ఎదురు చూస్తున్న షినుక్ -47ఎఫ్ ఐ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు గుజరాత్లోని ముంద్రా నౌకాశ్రయానికి చేరుకొన్నాయి. వీటిని అమెరికాలో ఫిలడేల్పియాలోని బోయింగ్ కర్మాగారంలో తయారు చేసి విడిభాగాలుగా భారత్ చేర్చారు. ఇక్కడే అసెంబుల్ చేసి వాయుసేనకు అప్పజెప్పనున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హెలీకాప్టర్లలో షినుక్ కూడా ఒకటి. ఓ వైపు టిబెట్ అరుణాచల్ సరిహద్దుల్లో చైనా మోహరింపులు పెరిగిపోవడంతో భారత్పై ఒత్తిడి పెరిగిపోయింది. సంక్షోభ సమయంలో సరిహద్దులకు బలగాలను తరలించడం అతిపెద్ద సమస్యగా మారుతుందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో సరిహద్దులకు చేరేందుకు ఉన్న రవాణా మార్గాలను, సౌకర్యాలను వీలైనంత మెరుగు పర్చుకొనే పనిలో పడింది. ఇందులో భాంగంగానే 2015లో 15 షినుక్ హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేసింది.
రెండు రొటేటర్లతో విభిన్నంగా కనిపించే ఈ హెలికాప్టర్ చాలా శక్తివంతమైంది. దాదాపు 10 టన్నులకు పైగా పేలోడ్ను ఇది తీసుకెళ్లగలదు. ఈ లెక్కన ఎం777 శతఘ్నులను ఒక చోట నుంచి మరో చోటుకు తేలిగ్గా తరలించగలదు. సైనిక దళాలను వేగంగా పర్వతాలతో కూడిన సరిహద్దులకు చేర్చడానికి ఇవి ఎంతగానో అక్కరకు రానున్నాయి. ఎం777 శతఘ్నులను భారత సైన్యం చైనా సరిహద్దుల్లో మోహరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి షినుక్ రాకతో మరింత బలం చేకూరింది. ఇంధన సరఫరా, సహాయ కార్యక్రమాల్లో ఇది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని భారత సైన్యం చెబుతోంది.
ఇప్పటి వరకు భారత వాయుసేనలో రష్యా తయారు చేసిన ఎంఐ26 హెలికాప్టర్లు ఉన్నాయి. అత్యంతక కీలకమైనర హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రస్తుతం భారత సైన్యం వీటిని వినియోగిస్తోంది. శక్తి పరంగా చూసుకుంటే షినుక్ కంటే వీటి ఇంజిన్లు చాలా పెద్దవి. కానీ ఇదే పెద్ద లోపంగా మారింది. ఈ హెలికాప్టర్లు ఇంధనాన్ని విపరీతంగా వాడుకోవడంతో వినియోగం భారంగా మారింది. ఎలాంటి ఆయుధ సంపత్తి లేని ఎంఐ 26 హెలికాప్టర్ దాదాపు 28 టన్నులు బరువు ఉండగా అమెరికా రూపొందించిన షినుక్ ఖాళీ హెలికాప్టర్ బరువు 10 టన్నులు మాత్రమే ఉంటుంది. ఎంఐ 26 హెలికాప్టర్ల శక్తిలో 15శాతం తోకభాగంలో ఫ్యాన్ కారణంగా వృథా అవుతుంది. షినుక్లో ఈ సమస్యలేదు. అంతేకాకుండా ఎంఐ26 హెలికాప్టర్లు విడిభాగాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించిన మోడీ ప్రభుత్వం 2015లో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అత్యాధునిక హెలికాఫ్టర్లను భారత వాయుసేన అమ్ములపొదిలో అస్త్రాలుగా సైన్యం భావిస్తోంది.