సీఎం కేసీఆర్ సభకు ఇందూరు ముస్తాబయ్యింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావంలో భాగంగా సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం తనయ కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేస్తుండడం, ఇదే బహిరంగ సభపై కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు నిజామాబాద్ సభలో పాల్గొననున్నారు. కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రాచారం ప్రారంభించిన కేసీఆర్, రెండో సభను నిజామాబాద్లో నిర్వహిస్తుండడం, ఇదే వేదికపై పార్లమెంట్ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉండడంతో ఈ సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సీఎం ప్రచార సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ ఎంపీ కవిత దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలకు లోబడి ఎలాంటి ఘటనలు జరగకుండా 15 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ నిజామాబాద్ చేరుకోనున్నారు. ఈ సభలో అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉండడం, సీఎం తనయ కవిత ఇక్కడి నుంచే ఎంపీగా బరిలో నిలుస్తుండడంతో సభపై అంచనాలు మరింత పెరిగి, ఆసక్తికరంగా మారింది.