దాయాదుల పోరులో టీమిండియా ఆటగాళ్లు సరికొత్త రికార్డులను నమోదు చేసుకున్నారు. 11 వేల పరుగులు పూర్తి చేసిన 9 వ ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా తక్కువ మ్యాచ్ల్లోనే ఈ ఘనత అందుకున్న ఆటగాడిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్లో 11 వేల మార్క్ అందుకోగా కోహ్లి కేవలం 222 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనతను సాధించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 11 ఏళ్ల లోపే ఈ ఘనతను సొంతం చేసుకున్న ఆటగాడిగానూ కోహ్లి రికార్డుల్లో నిలిచాడు.
మరోవైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. పాకిస్తాన్పై వరల్డ్కప్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఆదివారం నాటి మ్యాచ్లో రోహిత్ 140 పరుగులు చేయడంతో వరల్డ్కప్ చరిత్రలో పాక్పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. అంతేకాకుండా సిక్సర్లలో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. నిన్నటి మ్యాచ్లో 3 సిక్సర్లు కొట్టడంతో అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరపున ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. 358 సిక్సులతో ధోనీని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్లోకొచ్చాడు. ఇక వరల్డ్కప్లో తొలి మ్యాచ్లోనే ఫస్ట్ బాల్తో వికెట్ పడగొట్టిన ఆటగాడిగా విజయ్ శంకర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ భువనేశ్వర్ వేయగా పలు కారణాలతో అతడు గ్రౌండ్ వీడాల్సి వచ్చింది. దీంతో చివరి రెండు బంతులు వేసేందుకు బాల్ అందుకున్న విజయ్ శంకర్ ఫస్ట్ బాల్ తో వికెట్ దక్కించుకున్నాడు. ఒపెనర్ ఇమామ్ ఉల్ హక్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.