ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సంచలనం సృష్టించారు. ఒకేసారి దేశంలో ఉన్నత స్థాయి అధికారులు 5 గురికి మరణ శిక్ష విధించారు. వారిలో అమెరికాలోని తమ దేశ ప్రత్యేక రాయబారి కిమ్ హయెక్ చోల్ ఉన్నట్టు దక్షిణ కొరియా న్యూస్పేపర్ 'ది చోసన్ ఎల్బో' వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ల మధ్య రెండురోజుల శిఖరాగ్ర సదస్సులో హయెక్ చోల్ కీలకంగా వ్యవహరించారు. వియత్నాం రాజధాని హనోయ్లో జరిగిన ఈ సమావేశానికి కిమ్తో పాటు ఆయన ప్రైవేటు రైలులో ప్రయాణించి హనోయ్ చేరుకున్నారు. అయితే, 'మార్చిలో మిరిమ్ విమానాశ్రయంలో కిమ్ హయెక్ చోల్కు ఫైరింగ్ స్క్వాడ్ మరణశిక్ష అమలు చేశారనీ, ఆయనతో నలుగురు విదేశాంగ అధికారులకు కూడా ఇదే శిక్ష విధించార'ని గుర్తు తెలియని వర్గాలు వెల్లడించినట్టు 'ది చోసన్ ఎల్బో' తెలిపింది. మరణశిక్షకు గురైన నలుగురు అధికారుల పేరు వెల్లడికాలేదు.
ట్రంప్తో జరిగిన శిఖరాగ్ర సదస్సులో తప్పు చేశారన్న ఆరోపణలతో కిమ్కు దుబాసి(ట్రాన్స్లేటర్)గా వ్యవహరించిన షిన్ హయి యంగ్ను కూడా జైలుకు పంపినట్టు దక్షిణ కొరియా న్యూస్పేపర్ తెలిపింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్కు కిమ్ చేసిన కొత్త ప్రతిపాదనను అనువదించడంలో షిన్ హయి విఫలమయ్యారని ఆమెపై అభియోగాలు నమోదు చేసినట్టు వెల్లడించింది. కాగా ఈ వ్యవహారంపై ఉత్తర కొరియా స్పందించేందుకు అంగీకరించడం లేదు.