బంగారు గని కూలడంతో 30 మంది మృతి చెందారు. ఈ ఘటన అఫ్గానిస్తాన్ లో చోటుచేసుకుంది. బదక్షన్ ప్రావిన్సులోని కోహిస్తాన్ జిల్లాలో ఉన్న ఓ బంగారు గనిలో కార్మికులు పనిచేస్తుండగా గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో శిథిలాల్లో చిక్కుకుని 20 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ మరో 10 మంది మృతిచెందారు.
ఈ ఘటనపై కోహిస్తాన్ గవర్నర్ మొహమ్మద్ రుస్తమ్ రఘీ మాట్లాడుతూ.. ఇక్కడి గ్రామస్తులు నదీతీరంలో బంగారం కోసం 200 అడుగుల లోతైన గనిని తవ్వారు.. ఇంకా లోపలకు దిగి తవ్వకాలు జరుపుతుండగా పైనున్న గోడ ఒక్కసారిగా విరిగిపడింది. దాంతో ఈ దుర్ఘటన జరిగిందని ఆయన అన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు 50,000 అఫ్గానీలు, క్షతగాత్రుల కుటుంబాలకు 10,000 అఫ్గానీలు నష్టపరిహారంగా అందిస్తామని గవర్నర్ ప్రకటించారు.