ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జిల్లాకో మైనింగ్ డాన్ను తయారు చేశారని, మైనింగ్, ఎర్రచందనం, ఇసుక, మట్టి, భూ కబ్జా,కాల్మనీ మాఫియాలకు చంద్రబాబే డాన్ అని వైఎస్సార్సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి తూర్పారబట్టారు. హైకోర్టు తప్పుబట్టినా కూడా మైనింగ్ మాఫియాకు సహకరిస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని ఆధ్వర్యంలోనే అక్రమ మైనింగ్ జరిగిందని, జరుగుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..వైసీపీ అధినేత జగన్ కు వస్తున్న ప్రజాదరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారని, జగన్ ను ఎదుర్కోలేక కుట్రలకు పాల్పడుతున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గతంలో సోనియాగాంధీతో చేతులు కలిపి జగన్ పై తప్పుడు కేసులు పెట్టించారని ఇప్పుడు జగన్ పరపతిని దెబ్బతీసేందుకు ఆయన భార్య భారతిని కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే ఇద్దరు ఈడీ అధికారులు చంద్రబాబుకు కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు సమర్పించాల్సిన పత్రాలను కూడా ముందుగానే చంద్రబాబుకు ఇచ్చారని అన్నారు.
హెరిటేజ్ సంస్థలో బ్రాహ్మణికి రూ. 9 కోట్లకు పైగా జీతం వస్తుందనే విషయాన్ని చంద్రబాబు ఎందుకు బయటపెట్టడం లేదని భూమన ప్రశ్నించారు. హెరిటేజ్ ఆదాయ వ్యవహారాలపై చంద్రబాబు విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. హెరిటేజ్ అక్రమాలు, లోకేష్ అవినీతిపై భవిష్యత్తు ప్రభుత్వాలు విచారణ చేస్తాయని అన్నారు. చంద్రబాబు అవినీతి గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓ పుస్తకమే రాశారని చెప్పారు.