వరంగల్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం నత్తనడక సాగుతోంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని వరంగల్ జిల్లాలోనే ప్రారంభించారు. జనవరిలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నెలలు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. వాస్తవ పరిస్థితులేంటీ ?
తెలంగాణ సర్కార్ లక్ష్యం నీరుగారుతోంది. పేదలకు సొంతింటి కళ నెరవేర్చాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే అధికారుల నిర్లక్ష్యంగా పేదలపాలిట శాపంగా మారింది. ఇళ్ల నిర్మాణానికి చెరువు శిఖం భూమిని ఎంపిక చేశారు. అయితే నిబంధనల పేరుతో నిర్మాణాలను ప్రారంభించకుండా కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యమంత్రి భూమి పూజ చేసినా ఫలితం లేకుండా పోయింది.
2015లో వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ 9 మురికివాడల్లో పరిస్థితిని పరిశీలించారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చి భూమి పూజ కూడా చేశారు. 9 కాలనీల్లో ఎస్ఆర్ నగర్, అంబేద్కర్ నగర్లో మాత్రమే ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యాయి. మిగతా ప్రాంతాల్లో కేసీఆర్ హామీ కాగితాలకే పరిమితమయింది. ప్రగతినగర్లో జీప్లస్ త్రీ పద్దతిలో ఇళ్లు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. స్థలంతో పాటు 215 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. అయితే స్థలం చెరువు శిఖం భూమి ఎఫ్టీఎల్ పరిధిలో ఉండటంతో అధికారులు ఇళ్లను నిర్మించేందుకు సాహసం చేయలేదు. ఇళ్లు కూల్చుకున్న బాధితుల్లో మూడేళ్లుగా అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నారు.
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయ్. ఐదు జిల్లాల్లో ఏ ఒక్క చోట కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. మొదటి సారి ఇళ్ల నిర్మాణాలు వరంగల్ జిల్లాలోనే ప్రారంభమైనా పనులు మాత్రం జరగడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 4వేల 481 ఇళ్లు మంజూరైతే 824 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వరంగల్ రూరల్కు 150 ఇళ్లు, భూపాలపల్లి జిల్లాకు 5వేల 237 మంజూరైతే...3వేల 88 ఇళ్లు పనులు కొనసాగుతున్నాయ్. అటు మహబూబాబాద్ జిల్లాకు 1,433 మంజూరైతే 559, జనగామ జిల్లాలో 141 ఇళ్లకు పనులు జరుగుతున్నాయ్.
ఇళ్లు కూలగొట్టుకొని రెండేళ్లు పూర్తవుతున్నా నిర్మాణాలు మాత్రం పూర్తి చేయడం లేదు. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నేళ్లీలా అద్దె ఇంట్లో ఉండాలంటూ లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు.