న్యూజిలాండ్ లో ముగిసిన ఐసీసీ జూనియర్ ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులకు బీసీసీఐ భారీగా నజరానాలు ప్రకటించింది. పృథ్వీ షా నాయకత్వంలోని భారతజట్టు సభ్యులకు 30 లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది. జూనియర్ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ కు 50 లక్షల రూపాయలు, సహాయ సిబ్బందికి 20 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతులు ప్రకటించింది. ఆరేళ్ల విరామం తర్వాత జూనియర్ ప్రపంచకప్ టైటిల్ గెలుచుకొన్న భారతజట్టును ప్రధాని నరేంద్ర మోదీ, మాస్టర్ సచిన్ టెండుల్కర్, ఇతర ప్రముఖులు అభినందించారు.