తనను ప్రేమించి మోసం చేశాడని ఓ ప్రియురాలు విశాఖలోని రావికమతంలోని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి హల్చల్ చేసింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా కోదాడ గ్రామానికి చెందిన యువతి కుమారి(22), విశాఖపట్నం జిల్లా రావికమతం మండలంలోని గర్నికం గ్రామానికి చెందిన ఆర్లె శివను (23) ప్రేమించింది. ఆర్లె శివ ఏడాది క్రితం నల్గొండలో బీటెక్ చదివాడు. ఈ క్రమంలో శివ, కుమారిని ప్రేమించాడు. తర్వాత ఆమెను తప్పించుకు తిరగడం ప్రారంభించాడు. దీంతో కుమారి అతనిపై ఏడాది క్రితమే కోదాడ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. అయితే శివ కేసు భయంతో ఇక్కడికి వచ్చేశాడని ఆమె వివరించింది. అతని అడ్రస్ తెలుసుకుని ఆదివారం ఇక్కడికి వచ్చిన ఆమె శివ ఇంటిముందు బైఠాయించింది. దీంతో శివ, అతని కుటుంబసభ్యులను, యువతిని పోలీసుస్టేషన్కు రప్పించి విచారించామని ఎస్ఐ తెలిపారు. అయితే శివ మాత్రం తనకేమీ తెలియదని చెబుతున్నాడన్నారు. తెలంగాణలో కేసు నమోదైనందున ఇక్కడ కేసు నమోదు చేయమని చెప్పడంతో అక్కడే పరిష్కరించుకుంటామని ఇరువర్గాలు కోదాడ బయలుదేరి వెళ్లారని ఎస్ఐ తెలిపారు.