త్రిపురలో బీజేపీ విజయం చారిత్రాత్మకమని బీజేపీ నేత రామ్ మాధవ్ అన్నారు. 25 ఏళ్ళ వామపక్ష పార్టీల పాలనకు చెక్ పెట్టి...బీజేపీ అధికారం చేపట్టే దిశగా దూసుకుపోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ విప్లవాత్మక మార్పుకు ప్రధాని మోడీనే కారణమని రామ్ మాధవ్ కొనియాడారు. దాదాపు 25ఏళ్లుగా త్రిపురలో వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. దీంతో ఇక్కడ పోటీని భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం త్రిపురలో భాజపా, ఐపీఎఫ్టీ కూటమి 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, వామపక్షాలు 16 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
నాగాలాండ్లోనూ భాజపా-ఎన్డీపీపీ కూటమికి మంచి ఫలితాలు వస్తున్నాయని, అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రామ్ మాధవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే మేఘాలయలోనూ కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. ఇక్కడ భాజపా, ఎన్పీపీ, యూడీపీ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన సంగతి తెలిసిందే.