చాయ్‌వాలా కూతురుకు రూ. 3.8 కోట్ల స్కాలర్‌షిప్‌

Update: 2018-06-20 04:21 GMT

చాయ్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ వ్యక్తి కూతురుకు అమెరికా మస్సాచుసెట్స్‌లోని బాబ్సన్ కళాశాలలో స్కాలర్‌షిప్ వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బులందషహర్‌కు చెందిన సుదీక్ష భాటి సిబిఎస్‌సి ప్లస్‌టూ పరీక్షల్లో 98 శాతం మార్కులు తెచ్చుకొని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది ఆమెకు రూ.3.8 కోట్ల స్కాలర్‌షిప్ తెచ్చిపెట్టింది. ప్రతిష్టాత్మక బాబ్సన్ కాలేజీలో చదివే అవకాశం అందించింది. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన కాలేజీలో చదువుకునేందుకు దాదాపు నాలుగు కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ సుధీక్షా భాటీని వరించింది.  ఒక్కో సెమిస్టర్‌కి 70,428 అమెరికన్‌ డాలర్లు,  నాలుగేళ్ళ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుకి మొత్తం 3 కోట్ల 83 లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌ సొంతం చేసుకొని అమెరికాలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఒకటైన బాబ్సన్‌ కాలేజీలో చదువుకునే అత్యున్నతావకాశం సుదీక్షా భాటీ సొంతమైంది. 

కేవలం చదువులోనే కాదు సామాజిక కార్యకలాపాల్లో సైతం సుదీక్షా భాటీ ముందు వరుసలో ఉంటుంది. ఆడపిల్లల వేధింపులకు వ్యతిరేకంగా పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థలో ఉంటూ ఆడపిల్లలను చదివించాలని ఉద్యమిస్తోన్న సుదీక్షా భాటీ ఎందరో ఆడపిల్లలకు ఆదర్శంగా నిలుస్తోంది. పేదరికం కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొన్న సుదీక్ష ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకు సాగుతానంటోంది.  ‘‘అమెరికాలో చదవాలనే నా కల సాకారమయ్యింది. నా విజయం నాకే కాకుండా  నా కుటుంబానికీ, నేను చదువుకున్న పాఠశాలకూ పేరుప్రతిష్టలు సమకూర్చడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. మరింత పట్టుదలతో నా గమ్యం వైపు పయనిస్తాను. నా లక్ష్యసాధనకోసం కఠోరశ్రమ చేయాల్సి ఉంది. చేయగలనన్న నమ్మకం నాకుంది’’ అని సుధీక్షా భాటీ సగర్వంగా ప్రకటించారు.

Similar News