రెచ్చిపోయిన మణుగూరు ఎస్ఐ...వివాహేతర సంబంధంపై నిలదీసినందుకు భార్యపై దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్ఐ రెచ్చిపోయాడు. మరో మహిళతో వివాహేతర సంబంధంపై నిలదీసిన భార్యను అతి దారుణంగా కొట్టాడు. భార్యతో పాటు ఆమె బంధువులపై దాడి చేసి రక్తం కారేలా కొట్టాడు. మణుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న జితేందర్ పాల్వంచకు చెందిన పర్వీన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు భార్య పర్వీన్కు తెలిసింది. ఇదే విషయంపై భార్య భర్తల మధ్య కొంత కాలంగా గొడవ జరుగుతోంది. దీంతో ఎస్ఐ జితేందర్ భార్యకు దూరంగా విడిగా ఉంటున్నాడు.
ఇంటికి రాకుండా దూరంగా ఉంటున్న జితేందర్ మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్టు పర్వీన్ చెబుతోంది. మరో యువతితో ఉన్న వీడియోలు దొరకడంతో వివాహేతర సంబంధంపై జితేందర్ను భార్య పర్వీన్ నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన ఎస్ఐ జితేందర్... భార్య పర్వీన్తో పాటు ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసి దారుణంగా కొట్టాడు.