వార్నర్, స్మిత్ ఔట్

Update: 2018-03-25 12:03 GMT

ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్టు తెలియడంతో ఆసీస్ ఆటగాళ్లపై  క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. జెంటిల్ మెన్ గేమ్ పరువు ప్రతిష్టలను కాలరాసారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆలస్యంగా మేల్కొన్న ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ వివాదంలో ప్రమేయమున్న ఆటగాళ్లపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాను ఆదేశించింది. 

వందలాది కెమెరాల సాక్షిగా...  లక్షలాది మంది ప్రేక్షకులు, కోట్లాది అభిమానులు చూస్తుండగా బాల్ టాంపరింగ్ పాల్పడిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై ముప్పేట దాడి ప్రారంభమైంది.  జెంటిల్ మెన్ గేమ్  పోరాట స్పూర్తిని కొనసాగిస్తూ హూందాగ నడవాల్సిన ఆటగాళ్లు ఇంతగా దిగజారుతారా అంటూ క్రీడాభిమానులు మండిపడుతున్నారు.  ఇక ఈ వివాదంతో  పీకల్లోతు కష్టాల్లో పడిన క్రికెట్ ఆస్ట్రేలియా తక్షణ చర్యలు ప్రారంభించింది. పరువు, ప్రతిష్టలను మంటగలిపేలా వ్యవహరించారంటూ కెప్టెన్, వైస్ కెప్టెన్ లపై  పై తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే పదవుల నుంచి తప్పుకోవాలంటూ బోర్డు  సూచించడంతో  కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌లు తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. దీంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు చివరి రెండు రోజులకు వికెట్‌ కీపర్‌ టిమ్ పైన్  కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్సీ  కోల్పోయిన స్మిత్ కు ఐపిఎల్ లోను చేదు అనుభవమే ఎదురైంది. రాజస్దాన్ రాయల్స్ కు నేతృత్వం వహిస్తున్న స్మిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్టు  యాజమాన్యం ప్రకటించింది. స్మిత్ ప్రవర్తనను ఏమాత్రం సహించలేమన్న జట్టు యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేసింది. ఇదే సమయంలో ట్యాంపరింగ్ వివాదంపై తీవ్రంగా స్పందించిన ICC బాన్ క్రాఫ్ట్ పై ఒక మ్యాచ్ నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో వందశాతం కోత విధించింది. దీనికి తోడు విచారణ కమిటీకి కూడా ఆదేశించడంతో ఆస్ట్రేలియా జట్టుకు మరిన్ని చిక్కులు ఎదురుకానున్నాయి.  

Similar News