నిన్న ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హతుడైన తన కుడిభుజం, నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నీరు కారుస్తూనే పాడె మోశారు. హత్య విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చారు. శ్రీనివాస్ కుమార్తెను ఓదారుస్తూ వెంకట్రెడ్డి బోరున విలపించారు. కుటుంబాన్ని ఓదార్చారు. అంతిమ యాత్రలో చివరికంటా ఉండి శ్రీనివాస్ పాడెను మోశారు. శ్రీనివాస్ హత్యకు కారకులను అరెస్టు చేయాలని, సీబీసీఐడీతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం మూడు గంటలపాటు ధర్నా చేశారు.
ఒక్కరోజు ముందు తనతో ఉన్న వ్యక్తి, తాను హైదరాబాద్ వెళ్లేసరికి దూరం కావడం తనను కలచి వేస్తోందని ఏడుస్తున్న ఆయన్ను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ఈ సందర్భంగా ఆయన కొంతసేపు సొమ్మసిల్లి పడిపోగా, పక్కనే ఉన్న కాంగ్రెస్ నేతలు సపర్యలు చేశారు. కాగా, శ్రీనివాస్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో సైతం దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తన అనుచరుల మధ్య వాగ్వాదం జరుగుతోందని తెలుసుకున్న ఆయన, దాన్ని ఆపేందుకు వెళ్లి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే.