మేం పెళ్లి చేసుకుంది భారత్-పాక్లను కలపడానికి కాదు: సానియా మీర్జా
ఇండియన్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా ప్రస్తుతం అంతర్జాతీయ టెన్నిస్కు దూరంగా ఉంది. గర్భవతి అయిన కారణంగా ప్రొఫెషనల్ కెరీర్ నుంచి బ్రేక్ తీసుకున్న సానియా తొలి సంతానం కోసం ఎదురుచూస్తోంది. ఓ ప్రముఖ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత మహిళా టెన్నిస్ దిగ్గజం సానియా ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.`భారత్, పాకిస్తాన్లను కలపడం కోసమే మేం పెళ్లి చేసుకున్నామని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ, అది నిజం కాదు. నా భర్త తరఫు బందువులను కలవడానికి నేను సంవత్సరానికి ఓ సారి పాకిస్తాన్ వెళ్తాను. అక్కడ నాకు లభించే ప్రేమ, గౌరవం అపారం. ఆ దేశ ప్రజలందరూ నన్ను వదినగా భావిస్తారు. నా భర్తపై ఉన్న అభిమానం వల్ల నాపై ప్రేమను కురిపిస్తారు. షోయబ్ భారత్ వచ్చినపుడు ఇక్కడి ప్రజలు కూడా అదే స్థాయిలో ప్రేమను చూపిస్తారు` అని సానియా చెప్పింది.