పదేళ్లుగా ప్రేమించుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్ రాయదుర్గంలోని సైనా నివాసంలో కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత ఆప్తుల మధ్య వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి వివాహ వేడుకకు ముఖ్య అతిథులుగా గవర్నర్ దంపతులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్టులు పారుపల్లి కష్యప్, సైనా నెహ్వాల్ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. సైనా నివాసంలో జరిగిన ఈ వేడుక దగ్గరి బంధువులు, ఆత్మీయుల మధ్య నిరాడంబరంగా జరిగింది.
డేటింగ్ చేస్తున్నా ఎంతో హుందాగా మెలుగుతూ వచ్చిన వీరు కుటుంబపెద్దల ఆమోదంతోనే అదీ తమతమ జీవితలక్ష్యాలు సాధించిన తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించున్నారు. దానికి అనుగుణంగానే వ్యవహరించారు. పెద్దల సమక్షంలోనే ఒక్కటయ్యారు. వీరి వివాహమహోత్సవానికి గవర్నర్ దంపతులు విశిష్ట అతిథులుగా విచ్చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. జీవితంలో ఇదే గొప్ప మ్యాచ్ అంటూ వివాహం తర్వాత సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని సంతోషం వ్యక్తం చేశారు.
రేపు హైటెక్ సిటీలోని నోవాటెల్ లో వివాహ విందును ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ రానున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఫ్యామిలీతో పాటు మంత్రి కేటీఆర్ ఇతర రాజకీయ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. వీరిద్దరూ ఫ్యూచర్లో అంతర్జాతీయ పోటీల్లో జోడీగా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Best match of my life ❤️...#justmarried ☺️ pic.twitter.com/cCNJwqcjI5
— Saina Nehwal (@NSaina) December 14, 2018