భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత రత్న పార్లమెంట్లో నీకు మాట్లాడటానికి లైసెన్స్ ఇచ్చిందా? అంటూ సచిన్ను ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు. తమ పార్టీ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన ప్రధాని క్షమాపణలు చెప్పేంత వరకు సభను సజావుగా సాగనివ్వమని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆమె చెప్పారు. కాగా, రైట్ టూ ప్లే అండ్ ఫ్యూఛర్ ఆఫ్ స్పోర్ట్స్ అనే అంశంపై సచిన్ ప్రసంగించాల్సి ఉండగా.. కాంగ్రెస్ సభ్యుల నిరసనలతో సభ నేటికి వాయిదా పడింది. యూపీఏ హయాంలోనే సచిన్ రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. మరోపక్క బీజేపీ నేతలు సచిన్కు మద్ధతుగా నిలుస్తున్నారు. ఓ దిగ్గజ ఆటగాడికి ఇలాంటి గౌరవం ఇస్తారా? అంటూ ప్రతిపక్షాలపై మండిపడుతున్నారు.