దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. మాస్క్లతో వచ్చిన గుర్తు తెలియని అగంతకులు పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఓ బ్యాంక్ను దోపిడి చేశారు. వారిని అడ్డుకున్న క్యాషియర్ను తుపాకితో కాల్చి చంపారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీ చావ్లా సమీపంలోని కైరా గ్రామ కార్పోరేషన్ బ్యాంకులో చోటుచేసుకుంది. మృతి చెందిన క్యాషియర్ సంతోష్కుమార్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఉద్యోగని పోలీసులు తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత సంతోష్ కార్పోరేషన్ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ దోపిడీలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, ముఖాలకు మాస్క్లు ధరించి, తుపాకులతో దాడి చేశారని పోలీసులు తెలిపారు.
వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన సంతోష్ను షూట్ చేశారన్నారు. బుల్లెట్ అతని చాతిలోకి దూసుకెళ్లిందని, తాము సంఘటనాస్థలికి వచ్చేలోపే అగంతకులు తప్పించుకున్నారని, రక్తపుమడుగులో ఉన్న సంతోష్ను వెంటనే ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికే సంతోష్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో బ్యాంకులో ఆరుగురు ఉద్యోగులు, 8 మంది బ్యాంకు వినియోగదారులున్నారని, నిందితులు ఎవరిని కాల్చమని చెప్పారని, ఇంతలో సంతోష్ ప్రతిఘటించడంతో అతనిపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. సంతోష్కు భార్య ఇద్దరు పిల్లలున్నట్లు పేర్కొన్నారు. రూ.2 లక్షలు ఎత్తికెళ్లినట్లు బ్యాంకు ఉద్యోగులు తమకు తెలిపారని, అగంతకులు చేసిన దోపిడిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వివరించారు.