తమిళనాడులోని ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్లో 256 కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 59 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డీఎంకే అభ్యర్థి మరుదుగణేశ్, అన్నాడీఎంకే అభ్యర్థి ఇ. మధుసూదన్, అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్, బీజేపీ నేత కరు నాగరాజన్లు ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ మరుదుగణేశ్, దినకరన్, మధుసూదన్ల మధ్యనే ఉంటుందని అంచనా.
దివంగత జయలలిత నియోకవర్గంలో జరుగుతున్న ఎన్నికలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికను అధికార అన్నాడీఎంకేతో పాటు , విపక్ష డీఎంకే అన్నాడీఎంకే అసమ్మతి నేత దినకరన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓటర్లకు డబ్బు వెదజల్లుతున్నారన్న సమాచారంతో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. అలాగే పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. దాదాపు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా పర్యవేక్షిస్తున్నారు.