రజనీకాంత్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారో లేదో పొత్తు షురూ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ డీఎంకే అధినేత కరుణానిధితో భేటీ అవ్వడం చర్చాంశనీయంగా మారింది. పార్టీ ప్రకటించి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. ఇంతలోనే డీఎంకే తో చర్చలు జరపడం పలు అనుమానాలకు తావిస్తున్నట్లు తమిళనాట ఒకటే చర్చ. పార్టీ పెట్టేది సుపర్ స్టారే అయినా...నడిపించేది మాత్రం మాస్టర్ బ్రెయిన్ కరుణానిధి అని సమాచారం.
రజనీ- కరుణా నిధి భేటీలో ఓ 20నిమిషాల పాటు చర్చలు జరగ్గా..అందులో పార్టీ ప్రస్తావన, ఎజెండా, భవిష్యత్ కార్యచరణ, వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించే మాట్లాడుకున్నారట. రజనీకి ఎప్పటికప్పుడు కరుణానిధి సలహాలు, సూచనలు అందిస్తూ ఎన్నికల్లో దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అయితే గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలా పార్టీని ప్రారంభించి ఏపీ సీఎం చంద్రబాబు తో భేటీ అయ్యారో..రజనీ కాంత్ కూడా అలాగే కరుణానిధితో మంతనాలు జరిపారనేది టాక్. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ..చంద్రబాబుకు ఎలా మద్దతు ఇచ్చారో..వచ్చే ఎన్నికల్లో రజనీకాంత్ కూడా కరుణానిధికి అలాగే మద్దతు ఇస్తారనేది సారాంశం. ఏది ఎలా ఉన్నా పవన్ కల్యాణ్ ..రజనీ కాంత్ ఒకటేనని విశ్లేషకులు అభిప్రాయాపడుతున్నారు.