కామన్వెల్త్ గేమ్స్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం క్రీడాభిమానులకు పండగే. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో భారత స్టార్ క్రీడాకారిణీలు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఫైనల్స్కు చేరుకున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరికి స్వర్ణం మరొకరికి రజతం ఖాయమయ్యాయి. కానీ, ఎవరికి ఏ పతకం దక్కుతుందో అని ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెమీఫైనల్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థుల్ని మట్టి కరిపించి ఫైనల్కు దూసుకెళ్లారు. 2010లో బంగారు పతకం సాధించి సంచలనం సృష్టించిన సైనా... గాయాల కారణంగా 2014 గ్లాస్గో కామన్వెల్త్లో నిరాశగా వెనుదిరిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ పుంజుకుని తాజా కామన్వెల్త్ పోటీల్లో తనదైన శైలిలో ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. స్కాట్ల్యాండ్ క్రీడాకారిణి క్రిస్టీ గిల్మోర్పై 21-14, 18-21, 21-17 తేడాతో విజయం సాధించింది. ఇక గత కామన్వెల్త్ పోటీల్లో కాంస్య పతకం నెగ్గిన పీవీ సింధూ... ఇవాళ కెనాడా క్రీడాకారిణి మిచెల్లీ లీపై 21-18, 21-8 తేడాతో తిరుగులేని విజయం సాధించి ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకుంది.