దేశంలో అత్యంత నమ్మకమైన కన్జ్యూమర్ గూడ్స్ బ్రాండ్గా పేరులోకి వచ్చిన రాందేవ్ బాబా పతంజలి బ్రాండు ఆదివారం టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టింది. స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను రాందేవ్ బాబా లాంచ్ చేశారు. బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంలో ఈ సిమ్ కార్డులను ప్రవేశపెట్టారు. తొలుత ఈ సిమ్ కార్డు ప్రయోజనాలను పతంజలి ఉద్యోగులకు, ఆఫీసు బేరర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాందేవ్ బాబా చెప్పారు.
పతంజలి సంస్థ అందించే సిమ్కార్డుతో కేవలం రూ.144తో రీఛార్జి చేసుకుంటే దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని, 2జీబీ డేటా ప్యాక్తో పాటు 100ఎస్సెమ్మెస్లు పంపుకునే వీలుందని పేర్కొంది. మొదట్లో పతంజలి సంస్థకు చెందిన ఉద్యోగులు, అధికారులు మాత్రమే సిమ్కార్డు ప్రయోజనాలు పొందనున్నట్లు వెల్లడించింది. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ కార్డు ఉపయోగించి వినియోగదారులు పతంజలి ఉత్పత్తులపై 10శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చని వివరించింది.
ఇది మాత్రమే కాదు రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఆరోగ్య, ప్రమాద, జీవిత బీమాను కూడా ప్రజలకు అందిస్తామని చెప్పింది. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్కు 5లక్షల కౌంటర్లు ఉన్నాయని.. వాటి నుంచి ప్రజలు త్వరలో పతంజలి స్వదేశీ-సమ్రాధి కార్డును పొందవచ్చని యోగా గురువు, పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ సంస్థ అని.. పతంజలి, బీఎస్ఎన్ఎల్ సంస్థ రెండింటి ఉద్దేశం దేశ సంక్షేమమేనని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలిపారు.