రోజువాడుకునే సరకులు, ఆహార, ఆరోగ్య ఉత్పత్తుల రంగంలోకి అడుగు పెట్టి తక్కువకాలంలోనే వృద్ధిని నమోదు చేసిన సంస్థ పతంజలి. స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా తమ సంస్థ నుంచి పతంజలి పరిధాన్ పేరుతో బట్టలను ఉత్పత్తిచేస్తున్నట్లు గతంలోనే రాందేవ్ బాబా ప్రకటించారు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో 'పతంజలి పరిధాన్' పేరుతో యాక్సెసరీస్ స్టోర్ను సోమవారం ప్రారంభించారు. ధనత్రయోదశి, దీపావళి పండుగల సందర్భంగా పరిధాన్ జీన్స్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు రాందేవ్ బాబా వెల్లడించారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 200 పతంజలి పరిధాన్ స్టోర్స్ను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని బాబారాందేవ్ పేర్కొన్నారు.
ఈ స్టోర్లో మహిళలు, పురుషులు, చిన్నారులకు రకరకాల దుస్తులు లభించనున్నాయి. అంతేకాదు.. తొలి వస్త్రదుకాణాన్ని తెరిచినందుకు గాను పతంజలి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ధనత్రయోదశి నుంచి ఐదు రోజుల పాటు 25శాతం డిస్కౌంట్ కింద వస్త్రాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇక పతంజలి జీన్స్ రూ.500కే లభిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. రూ.2500 బ్రాండెడ్ షర్ట్స్ రూ.500కే ఇస్తున్నట్లు తెలిపారు.