రెండో రోజు మొదలైన పార్లమెంటు ఉభయసభలు తెలుగు ఎంపీల ఆందోళనతో కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ఏపీకి న్యాయం చేయాలంటూ లోక్సభలో టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. వెల్లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. విభజన హామీలు అమలు చేయాలని ఏపీ ఎంపీలు డిమాండ్ చేశారు. మరోవైపు రిజర్వేషన్ల కోటా పెంపు అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. అటు పెద్దల సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలుగు ఎంపీలు పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. దీంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను అరగంటపాటు వాయిదా వేశారు.