జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ హాల్లో 14 పార్టీల నేతలు సమావేశమయ్యారు. యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, లోక్తాంత్రిక్ జనతాదళ్ అధ్యక్షుడు శరద్యాదవ్, ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధినేత స్టాలిన్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా భాజపాయేతర కూటమి ఏర్పాటుపై చర్చించారు. అలాగే పార్లమెంట్లో మోడీ సర్కార్పై మూకుమ్మడి యుద్ధానికి దిగాలని నిర్ణయించారు. పార్లమెంట్ వ్యూహంతోపాటు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్పైనా చర్చించినట్లు తెలుస్తోంది.
విపక్షాల మీటింగ్లో కీలక పాత్ర పోషించిన టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశానికి ముందు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే ఎంపీ కనిమొళి ముందస్తు చర్చలు జరిపారు. అయితే బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశానికి మొదటిసారి ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకాగా యూపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అఖిలేష్, ములాయం, మాయావతిలు డుమ్మా కొట్టడం కొంత షాకిచ్చింది.