ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తెలంగాణలో చిరంజీవికేదిక్కులేదు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ను ఎవరు పట్టించుకొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంపై కేంద్రీకరిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. గురువారం సాయంత్రం మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆమె పలు విషయాలపై మాట్లాడారు. గతంలో సీఎం కేసీఆర్, పవన్ ఒకరినొకరు ఏమనుకున్నారో ప్రజలందరికీ బాగా తెలుసు కానీ ఇప్పుడేమో అవసరాల కోసం కలిసిపోయి ఉండొచ్చని ఆమె అభివర్ణించారు. పవన్.. తెలంగాణను వదిలేసి ఏపీలో దృష్టిపెడితే బాగుంటుందని రాములమ్మ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు పవన్ను ఆమోదించరని ఆమె తేల్చిచెప్పారు. రెండు చోట్ల ఆమోదం పొందడం చంద్రబాబు వల్లే కాలేదన్న విషయాన్ని విజయశాంతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాములమ్మ తాజా వ్యాఖ్యలతో పవన్ అభిమానులు గుర్రుమంటున్నారు.