చేతిలో ఏటీఎం కార్డు ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వెళదామంటే ఇకపై కుదరదు. ఎనీటైం మనీ కాస్తా పని వేళల బోర్డు తగిలించుకోనుంది. సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఏటీఎం సెంటర్లపై నియంత్రణ చేపట్టనున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఏటీఎంలను ఇకపై రాత్రి వేళ మూసీవేయాలని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఐదు కంటే తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎంలను దీని పరిధిలోని తేవాలని నిర్ణయించారు. నగరంలో ఇటీవల కాలంలో జరిగిన పలు సైబర్ నేరాలు ఏటీఎంలే ఆధారంగా జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో శివారు ప్రాంతాల్లోని ఏటీఎం ద్వారానే ఈ ఘటనలు జరిగినట్టు నిర్ధారించున్నారు. ఈ తరహా నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ బ్యాంకర్లతో ఇదే అంశంపై చర్చించారు. ఏటీఎంలు కేంద్రంగా జరిగే సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను బ్యాంకర్లకు పోలీసులు వివరించారు.
రాత్రి వేళ ఐదు కంటే తక్కువ లావాదేవీలున్న ఏటీఎంలలో 95 శాతం మారుమూల ప్రాంతాల్లోనే ఉన్నాయి. జనసమర్ధతం తక్కువగా ఉండటం వల్ల వీటిని డెబిట్ ,క్రెడిట్ కార్డుల్ని క్లోనింగ్ చేసే ముఠాలు ఎంచుకుంటున్నాయి. రాత్రి వేళ ఏటీఎంలకు స్కిమ్మర్లు, స్మార్ట్ కెమెరాలు ఏర్పాటు చేసి ఖతాదారుల సమాచారం, పిన్ నంబర్లు తెలుసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన పలు అనుమానాస్పద లావాదేవీల్లో ఇదే అంశం బయటపడింది. దీంతో పలుకోణాల్లో విచారణ జరిపిన పోలీసులు ఈ సూచన చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన బ్యాంకర్లు దీని వల్ల తమకు కూడా నిర్వాహణ ఖర్చులు తగ్గుతాయంటున్నారు. ఉన్నతాధికారుల అనుమతి లభించిన వెంటనే ప్రతిపాదనను అమలుచేస్తామంటూ పోలీసులకు హామీ ఇచ్చారు.