మహాకూటమి కూకట్ పల్లి అభ్యర్థి, టీడీపీ నేత నందమూరి సుహాసిని నామినేషన్ వేశారు. మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి సుహాసిని నామినేషనల్ పత్రాలు అందించారు. కూకట్ పల్లిలో గెలుస్తానని సుహాసిని ధీమా వ్యక్తం చేశారు. కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి , హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని ఎన్నికల బరిలో నిలిచారు. అనూహ్యంగా టికెట్ రావడంతో శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు, ఆ తర్వాత ఫిల్మ్నగర్లోని మహాప్రస్థానం వద్ద తండ్రి సమాధికి నివాళులర్పించారు. హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి, నామినేషన్ పత్రాలపై అక్కడే సంతకాలు చేశారు.
జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో సుహాసిని నామినేషన్ వేశారు. కూకట్పల్లిలో తన గెలుపు ఖాయమని సుహాసిని ధీమా వ్యక్తం చేశారు. దివంగత నేతలు ఎన్టీఆర్, హరికృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబు, బాబాయ్ బాలయ్య ఆశీస్సులతో ప్రజాసేవకు ముందడుగు వేస్తున్నానన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలను కోరారు. తాను గెలిస్తే కూకట్ పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు. తెలంగాణ ప్రజలు, ఆడపడుచులు సుహాసినిని ఆదరించాలని నందమూరి లోకేశ్వరి కోరారు. తన సోదరుడు హరికృష్ణలాగే సుహాసినిది కూడా కష్టించి పనిచేసే తత్వమని, కూకట్పల్లి ప్రజలు నిండు మనసుతో ఆమెను ఆశీర్వదించాలని ఆమె తెలిపారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబులు చేసిన అభివృద్ధి గురించి తెలంగాణ ప్రజలకు మరోసారి గుర్తు చేస్తామని బాలకృష్ణ తెలిపారు.
తెలుగుదేశం పార్టీ తమకు ఎంతో పవిత్రమైందన్నారు నందమూరి బ్రదర్స్. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న సిద్ధాంతంతో తాతగారు పార్టీ స్థాపిస్తే ఆ పార్టీకి మా తండ్రి సేవలందించారని చెప్పారు. ఇప్పుడు అదే స్పూర్తితో కూకట్పల్లి బరిలో దిగుతున్న నందమూరి సుహాసినికి విజయం చేకూరాలని ఆమె సోదరులు కల్యాణ్రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలని నమ్మే కుటుంబం తమదని వారు పేర్కొన్నారు.
Wishing my sister Suhasini garu all the very best, as she takes her first step into public service pic.twitter.com/Hl2TJ4rMsd
— Jr NTR (@tarak9999) November 17, 2018