ముంబైలో ఘోర ప్రమాదం తప్పింది. అంధేరీ రైల్వే స్టేషన్లో రోడ్ ఓవర్ బ్రిడ్జిలో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. బ్రిడ్జి కూలడంతో పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. బ్రిడ్జి కూలిన వెంటనే ముంబై పశ్చిమ లైన్పై సబర్బన్ రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు
ఈ ఉదయం అంధేరీ రైల్వే స్టేషన్ పక్కన గోఖలే రోడ్ ఓవర్ బ్రిడ్జి కొంత భాగం కుప్పకూలి ట్రాక్పై పడిపోయింది. ఆ సమయంలో రైళ్లేవీ ఆ మార్గంలో రాకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ముంబైలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్లే బ్రిడ్జ్ కూలినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంధేరి ఈస్ట్, అంధేరి వెస్ట్ను కలిపే ఈ వంతెన కూలడంతో రైల్వే స్టేషన్లోని ఓవర్హెడ్ ఎక్విప్మెంట్ ధ్వంసమైందని పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనతో సెంట్రల్ రైల్వేకు చెందిన రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షంలోనూ...రైల్వే ట్రాక్పై కూలిన బ్రిడ్జ్ శిథిలాలను తొలిగించేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.