భర్త మృతి చెందాడన్న చేదునిజాన్ని తట్టుకోలేని భార్య తన కొడుకు గొంతుకోసి.. ఆమెకూడా యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురంలో జరిగింది. దొడ్డబళ్లాపురానికి చెందిన చందన్, వీణ (35) దంపతులు వీరికి తుషార్ (13) కుమారుడు ఉన్నాడు. చందన్ ఓ మీడియా సంస్థలో యాంకర్ గా పనిచేస్తున్నాడు. అయితే వారి అన్యోన్య దాంపత్యంలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. గతనెల 24న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో యాంకర్ చందన్ దుర్మరణం పాలయ్యాడు. భర్త మృతి వీణకు తీరని శోకాన్ని మిగిల్చింది. చందన్ మృతితో తీవ్ర వేదన చెందిన వీణ తాను కూడా తనువు చాలించాలనుకుంది. తాను చనిపోతే కుమారుడు తుషార్ అనాధ అవుతాడన్న కారణంగా నిద్రిస్తున్న తుషార్ ను కత్తితో గొంతుకోసి ఆపై తాను కూడా యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో కుమారుడు తుషార్ మృతిచెందగా.. తీవ్ర గాయాలతో వీణ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బెంగళూరుకు తరలించారు. అయితే ఆమె చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు తెలిపారు.