వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా సంచలన ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో త్వరలోనే 'వైయస్సార్ అన్న' పేరుతో క్యాంటీన్లను సొంతంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. అందుకే, ప్రజల కోసం తానే సొంతంగా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నానని చెప్పారు. 10మంది చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు ఇచ్చామని, నగరి ప్రభుత్వాస్పత్రిలో, హాస్టళ్ళలో, బాలికల జూనియర్ కాలేజీలో ఆర్వో ప్లాంట్లు, కూలర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆకలితో బాధపడే వారికి కడుపు నిండా అన్నం పెట్టాలనే దృక్పథంతో త్వరలో వైఎస్ఆర్ అన్న క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేస్తానన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నగరి నియోజకవర్గం రూపురేఖలు మారుతాయని హామీ ఇచ్చారు.