కొంతమంది జన్మ నిచ్చే అమ్మ, కట్టుకున్న భార్య ఆడది కాని పుట్టే బిడ్డ మాత్రం ఆడది కాకుడదని భావిస్తారు. కాబట్టే పుట్టిన ఆడపిల్లల్ని పురిట్లో చిదిమేయడం, బ్రూణ హత్యలకు పాల్పడుతుంటారు. ఓవైపు సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు, ఆర్ధిక సమస్యలు,వరకట్నవేధింపులతో అమ్మాయి అంటే అయిష్టతను వ్యక్తం చేస్తుంటారు. అయితే దీన్ని అరికట్టేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా కొత్తసంవత్సరం రోజు డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజాము వరకు పేదింటికి చెందిన మహిళ ప్రభుత్వ ఆస్పత్రిలోనే నార్మల్ డెలివరీతో అమ్మాయికి జన్మనిస్తే ..అలా పుట్టే ఆడపిల్లలకు రూ.5లక్షలు,డిగ్రీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ప్రకటించినట్లుగా ఆడపిల్లకు జన్మించిన దంపతులకు రూ.5లక్షల చెక్ ను అందించారు. రాజాజీనగర్ కు చెందిన పుష్ప అనే మహిళకు పురిటినొప్పులతో డిసెంబర్ 31అర్థ రాత్రి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేర్చారు. సరిగ్గా కొత్త సంవత్సం మొదలైన ఐదు నిమిషాలకు(12.05) ఆడబిడ్డ పుట్టింది. ఆస్పత్రి వర్గాల సమాచారంతో మాటిచ్చిన ప్రకారం మేయర్ సంపత్రాజ్ సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి బాలింత పుష్పకు చెక్ అందజేశారు.ఈ సందర్భంగా ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తూ.. వచ్చిన డబ్బును తమ బిడ్డ చదువుకు ఉపయోగిస్తామని అన్నారు.