భార్యా అత్తను చితకబాదిన మణుగూరు ఎస్సైపై వేటు పడింది. ఎస్సై జితేందర్పై కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు శాఖాపరంగా చర్యలు చేపట్టారు. జితేందర్ను కొత్తగూడెం ఓఎస్డీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఎస్సై జితేందర్ దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య ఫర్వీనా తనకు న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారులను ఆశ్రయించించింది.
అధికారం ఉందనే అహంకారంతో భార్యా అత్తపై విచక్షణారహితంగా దాడి చేసిన ఎస్సై జితేందర్ తీరుపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకుని భార్యకు అన్యాయం చేస్తోన్న జితేందర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జితేందర్ రాసలీలల్ని ప్రశ్నించినందుకే భార్యా అత్తపై విచక్షణారహితంగా దాడి... పిడిగుద్దులు కురిపించాడని ఆరోపిస్తున్నారు.
2015లో ఎస్సై జితేందర్ తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు ఎస్కే ఫర్వీన్ తెలిపింది. అయితే పెళ్లయిన నాటి నుంచి మరో మహిళతో సంబంధం పెట్టుకుని తనను వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోతోంది. డెలివరీ టైమ్లో పుట్టింట్లో వదిలేసిన జితేందర్ 10నెలలుగా తనను పట్టించుకోవడం లేదని, కనీసం బాబు పుట్టాక చూడ్డానికి రాలేదని ఫర్వీన్ కన్నీరుమున్నీరవుతోంది. ఇవన్నీ ప్రశ్నించినందుకే తనను, అమ్మను, తన బంధువుల్ని రక్తంవచ్చేలా విచక్షణారహితంగా కొట్టాడని బాధితురాలు విలపిస్తోంది.
ఎస్సై జితేందర్ కుటుంబ సభ్యులు కూడా తనను బెదిరిస్తున్నారని బాధితురాలు ఫర్వీన్ ఆరోపిస్తోంది. తనను కాపురానికి తీసుకెళ్లాలని జితేందర్ను అడుగుతుంటే తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని, జితేందర్ కుటుంబ సభ్యులు కూడా తన భర్తకు మరో పెళ్లి చేస్తామని అంటున్నారని ఫర్వీన్ కన్నీళ్లు పెట్టుకుంటోంది.
పెళ్లయిన వారం రోజుల నుంచే పర్వీన్ను వేధింపులకు గురిచేశాడని పర్వీన్ బంధువులు అంటున్నారు. ఒకసారి అబార్షన్ చేయించాడని, రెండోసారి కూడా అబార్షన్ చేయించుకోమంటే పర్వీన్ ఒప్పుకోలేదని, దాంతో విడాకుల కోసం ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వీడియోలు పర్వీన్కు దొరకడంతో జితేందర్ను ప్రశ్నించిందని, అప్పట్నుంచే వేధించడం ప్రారంభించాడని బంధువులు చెబుతున్నారు.