ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టుకు హాజరవుతారా? నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ నోటీసులపై మొదటిసారి స్పందించిన చంద్రబాబు ఏం చెప్పారు? కోర్టు నోటీసుల్ని తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నారా? అసలు చంద్రబాబు ముందున్న ఆప్షన్స్ ఏంటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కోర్టు నోటీసులు కేంద్రం కుట్ర అంటూ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అయితే చంద్రబాబు అసలు కోర్టుకు హాజరవుతారా? లేదా? అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
చంద్రబాబుపై జారీ అయిన నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్పై మహారాష్ట్ర ధర్మాబాద్ పోలీసులు తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదా ఉండటంతో ఏవిధంగా వ్యవహరించాలన్నదానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఏం చేయాలన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి కావడంతో ప్రత్యామ్నాయ ఆప్షన్స్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
2010లో చంద్రబాబుపై కేసు నమోదుకాగా కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో 2013నుంచి నాన్బెయిలబుల్ సెక్షన్స్ జత చేశారు. ఇప్పుడు కోర్టు ఏకంగా నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంటే ఇష్యూ చేసింది. అయితే చంద్రబాబు ముందు కూడా పలు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కోర్టుకు హాజరై తన వాదన వినిపించడం అలాగే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడం ఇంకా అవసరమైతే ముంబై హైకోర్టును ఆశ్రయించడం... అయితే చంద్రబాబు కోర్టుకు హాజరవుతారా? లేదా? అన్నది త్వరలో తేలనుంది.