టీఆర్ఎస్ పార్టీ ప్రచార జోరు పెంచబోతోంది. కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారు కారు జెట్ స్పీడులో దూసుకుపోబోతోంది. ఇంతకాలం మహాకూటని సీట్లు ఫైనల్ కాలేదని ప్రచారానికి విరామం ఇచ్చిన కేసీఆర్ వరుసగా బహిరంగ సబల్లో పాల్గొనబోతున్నారు. బాస్ వస్తే క్షేత్ర స్థాయిలో సీన్ మారిపోతుందని టీఆర్ఎస్ అభ్యర్థులు భరోసాగా ఉన్నారు.
మహాకూటమి అభ్యర్ధుల లిస్ట్ ఫైనల్ కాకపోవడంతో కేసీఆర్ ప్రచార షెడ్యూలును వాయిదా వేస్తూ వచ్చిన గులాబీ పార్టీ నామినేషన్ల ఘట్టం ముగియనుండడంతో దూకుడు పెంచబోతోంది. పార్టీల అభ్యర్ధులు దాదాపుగా ఖరారు కావడంతో ప్రచార వేగం పెంచాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ నెల 19 నుంచి 25 వరకు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. గత ఎన్నికల్లో పదహారు రోజుల్లో తొంబైకి పైగా నియోజకవర్గాలను చుట్టేసిన కేసీఆర్ ఈ సారి కూడా తనదైన పాత్ర పోషించబోతున్నారు. కేసీఆర్ ప్రచారానికి ఏర్పాట్లు చేసుకోమని ఆయా నియోజక వర్గాల నేతలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి.
కేసీఆర్ మలివిడత ప్రచారాన్ని ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడుతున్నారు. ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు గెలిచి నిలవాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో గులాబీ బాస్ ఆ ప్రాంతం మలివిడత శంఖారావాన్ని పూరించబోతున్నారు. 19న ఖమ్మంలోనూ అదే రోజు జనగామ జిల్లా పాలకుర్తి బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 20న సిద్దిపేట, కరీంనగర్ జిల్లా హుజురాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కేసీఆర్ బహిరంగ సభలు ఉంటాయి. 21 నుంచి నిర్వహించే సభల్లో రోజుకు ఐదు నుంచి ఆరు సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 21 న జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్ సభల్లో పాల్గొంటారు. 22న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడలో, నిర్మల్, ముథోల్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ప్రచార సభలకు హాజరవుతారు. 23న నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామ సభల్లో ప్రసంగిస్తారు. 25న తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం సభలకు హాజరవుతారు.
సెప్టెంబర్ ఆరున టీఆర్ఎస్ అభ్యర్ధుల ప్రకటన తర్వాత వారంతా ప్రచారం పర్వంలో మునిగిపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి రెండునెలలకు పైగా హోరెత్తించారు. ఇప్పటి వరకు పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు అధినేత నేరుగా ప్రచార రంగంలోకి దిగనుండడంతో తమకే అనుకూల పవనాలు వీస్తామని టీఆర్ఎస్ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు.